Friday, March 27, 2020

శ్రీ ఆదిత్యవారనక్తవ్రతమ్‌

శ్రీ ఆదిత్యవారనక్తవ్రతమ్‌


మానవులకు ఆరోగ్య ప్రదమును అనంత ఫలప్రదమును శాంతి ప్రదమును నగు వ్రతమును తెలుపుమనిన నారదున కతడిట్లు వచించెను: విశ్వాత్మకమును సనాతనమునునగు పరబ్రహ్మ తత్త్వపు తేజము జగమున సూర్య చంద్రాగ్నులను మూడు రూపములతో ప్రకాశించుచున్నది. దాని నారాధించినవారు సదా క్షేమమునందుదురు. అందులకయి ఆదిత్య వారములందు నియతముగ పగలుపవసించి నక్తమున (రాత్రియందు) భుజించవలెను. ఎట్లన- ఆదిత్య వారముతో హస్త నక్షత్రము వచ్చినప్పుడు దానికి ముందటినాడు-శనివారమున పగటి మాత్రపు భోజనముతో ఏక భుక్తముచే విమత్సరుడై యుండి ఆదిత్యవారమునాడు బ్రాహ్మణులకు భోజనము పెట్టి తానును భుజించవలెను.
(దానికి ముందు) రక్తచందనముతో ద్వాదశ దళ పద్మము వ్రాసి దానియందు తూర్పున 'సూర్యాయనమః' ఆగ్నేయమున 'దివాకరాయనమః' దక్షిణమున 'వివస్వతేనమః' నైరృతమున 'భగాయనమః' పడమర 'వరుణాయనమః' వాయవ్యమున 'మహేంద్రాయనమః' ఉత్తరమున 'ఆదిత్యాయనమః' ఈశాన్యమన ' శాంతాయనమః' అని వ్రాయవలెను. అట్లే కర్ణికలో తూర్పున 'రవితురగేభ్యోనమః' దక్షిణమున 'యమాయనమః' పశ్చిమమున 'మార్తాండాయనమః' ఉత్తరమున 'రవయేనమః' కర్ణకనడుమ 'భాస్కరాయనమః' అని వ్రాయవలెను.

పిమ్మట ఆ పద్మమున నూవులును రక్తచందనమును కలిసిన రక్త పుష్పోదకముతో రవికి అర్ఝ్యమీయవలెను. (మంత్రార్థము): దివాకరానీవు కాలాత్ముడవు; సర్వభూతాత్ముడవు; వేదాత్ముడవు; సర్వతోముఖుడవు ; అగ్నీంద్రరూపుడవు; ఇట్టి నీకు తూర్పుదిశయందు నమస్కారము. 'అగ్నిమీళే' ఇత్యాది ఋక్కులతో నీకు నమస్కారము. 'ఇషేత్వోర్జేత్వా' ఇత్యాది మంత్రముతోను 'అగ్న ఆయాహి' ఇత్యాది మంత్రముతోను భాస్కరా! వరదా! జ్యోతిషాంపతీ! నీకునమస్సు. అనుచు రవి కర్ఝ్యము ఇచ్చి అతనికి ఉద్వాసనము చెప్పవలెను. ఆరాత్రి తైలము లేకుండ భుజించవలెను. ఇట్లు సంవత్సరము గడచిన తరువాత అనేక వ్రతములను దానములను ఆచరించినవాడు అంగవైకల్యము లేనివాడు జితేంద్రియుడు కుటుంబి పొగరులేనివాడు అగు బ్రాహ్మణుని ఎర్రనివికాని ఎరుపు పసుపు కలిసిన రంగువికాని అగు వస్త్రమాల్య ధూపములతో అర్చించి అతనికి యథాశక్తిగ బంగారుతో చేసిన పద్మమును ద్విభుజుడగు పురుషుని బంగారు కొమ్ములతో వెండిగిట్టలతో అపంలంకరించినదియు దూడ కలదియు పాలు పిదుకుటకు కంచుపాత్ర కలదియు అగు పాడి యావును దానమీయవలెను. (దానమంత్రము): ''పాపవినాశనుడు విశ్వాత్ముడు సప్తాశ్వుడు ఋగ్యజుస్సాను వేదములకు తేజస్సులకు నిధియు విధాతృడును సంసార సాగర నౌకయు జగత్పవిత్రుడునగు రవికి నమస్కారము.''
ఈ విధానమున సంవత్సరకాలమాచరించు మానవుడు పాపముక్తుడై సకల దేవతల తను సేవింప సూర్యపదమునందును. అతడు కర్మ నాశమును పొంది భూనాధుడై దుఃఖభయ రోగ రహితుడై ధర్మమూర్తియు అమితాయువునై ఊర్ద్వ సప్తలోకములను చేరి సుఖించును.
స్త్రీయైనను భర్తృ గురుదేవభక్తి కలిగి ఆదిత్యవార నక్తవ్రతమును ఇట్లాచరించినచో ఆమెయు దేవ గణ పూజితమగు ఉత్తమలోకమునందును . సందియము లేదు.
ఈ విధానమును వినినను చదివినను ఇతరులు చదువుట విని అనుమోదిం (ప్రశంసిం)చినను అట్టివాడును నూర్ల కోట్ల సంవత్సరములపాటు దేవపూజితుడై ఇంత్రభవనమున సుఖించును.
ఇది శ్రీమత్స్య మహాపురాణమున ఆదిత్యవార నక్త వ్రతమాహాత్య్మ కథనమను తొంబది ఆరవ అధ్యాయము.

No comments:

Post a Comment

శ్రీసూర్య నవావరణ స్తోత్రం

 శ్రీసూర్య నవావరణ స్తోత్రం